December 26th india covid update
India Covid Update: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. శీతాకాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో ఒకరు మృతి చెందడంతో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు 55కు చేరాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 45 పాజిటివ్ కేసులున్నాయి.
తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4170కు చేరింది. ఇదే సమయంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. తెలంగాణలో ఒకరు మరణించారు. కర్ణాటకలో మూడు కొత్తరకం వైరస్ కేసులు నమోదైనట్లు వివరించింది. ఈ ఏడాది తెలంగాణలో, ఏపీలో తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. విశాఖలో ఒక వ్యక్తి కరోనాతో మరణించాడు.
తాజాగా నమోదైన కేసుల్లో.. తెలంగాణలోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో నాలుగు, ఫీవర్ ఆస్పత్రిలో 5, నిలోఫర్ లో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లో 45, రంగారెడ్డి 3, సంగారెడ్డి 2, ఖమ్మం 1, కరీంనగర్ 1, వరంగల్ 2, మెదక్ 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో 10 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 8 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.