Kathija Bibi : ఆమె ఓ నర్సు. దాదాపు 10 వేల డెలివరీలు చేశారు. అన్నీ కూడా సాధారణ ప్రసవాలే కావడం విశేషం. కానీ ఒక్క బేబీ కూడా చనిపోలేదు. ఆమె 33 ఏళ్ల ట్రాక్ రికార్డు ఇది. తమిళనాడుకు చెందిన ఆ నర్సు పేరు కతీజా బీబీ.
1990లో ఓ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు కతీజా. ఆ సమయంలో ఆమె ఏడు నెలల గర్భిణిని కూడా. అయినా సరే ఇతర మహిళలకు సాయం చేశారు. డెలివరీ అయిన రెండు నెలలకే తిరిగి విధుల్లో చేరారు. ఆమె పని చేసే క్లినిక్ చెన్నైకు 150 కి.మీ దూరంలో గల విల్లుపురంలో ఉంది. ఇక్కడ సిజేరియన్ చేసేందుకు సరిపడా సౌకర్యాలు లేవు. గర్భిణీలకు ఏవైనా సమస్యలు వస్తే వెంటనే జిల్లా ఆసుపత్రికి పంపుతారు .
కతీజా తల్లి జులేఖా గ్రామ మంత్రసానిగా సేవలు అందించారు. తల్లి స్ఫూర్తితోనే కతీజా నర్సు వృత్తిని ఎంచుకున్నారు. పేదల కోసం తన తల్లి చేసిన కృషిని
చిన్న వయసులోనే గమనించారు. ఆ రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడో గానీ ఉండేవి కాదు. ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యకేంద్రాలపైనే ఆధారపడే వారు.
తాను కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక డాక్టర్, ఏడుగురు సహాయకులు, ఇద్దరు నర్సులు మాత్రమే ఉండేవారని అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు కతీజా. 1990లో దేశంలో ప్రసూతి మరణాల రేటు చాలా ఎక్కువ. అప్పట్లో లక్ష జననాలకు 556 మరణాలుగా ఉండేవి. శిశు మరణాల రేట్ వెయ్యికి 88గా ఉండేది. ప్రస్తుతం దేశంలో ప్రసూతి మరణాల రేటు లక్ష జననాలకు 97గా ఉంది. శిశు మరణాల రేటు వెయ్యికి 27గా ఉంది.
ఆడపిల్ల పుడితే భార్యను కూడా చూడని భర్తలను చూశానని కతీజా తన అనుభవాలను వివరించారు. రెండోసారి ఆడపిల్ల పుడితే కొందరు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం అబ్బాయి లేదా అమ్మాయి అని ఆలోచించకుండా ఇద్దరు పిల్లలైతే చాలని భావిస్తున్నారని తెలిపారు.
కతీజా రోజుకు ఒకరు లేదా ఇద్దరికి డెలివరీ చేస్తుంటారు. 2000 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒక అసిస్టెంట్ సహాయంతో 8 మందికి ప్రసవం చేశారు.
కతీజా చేసిన డెలివరీల్లో 50 మందికి కవలలు జన్మించారు. ఒకరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కతీజా 10 వేల డెలివరీలు చేసినందుకు ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు. కతీజా జూన్ 30న పదవీ విరమణ చేశారు.