India vs China: గల్వాన్ గాయం ఇంకా మాననే లేదు. 20 మంది భారత సైనికులను కోల్పోయిన బాధ తీరనే లేదు. మరోసారి, సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. డ్రాగన్ ఆర్మీ చర్యలతో మళ్లీ ఘర్షణ జరిగింది. ఈసారి ప్రాణాపాయం జరగకున్నా.. పదుల సంఖ్యలో సోల్జర్స్ గాయపడినట్టు సైన్యం తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ దగ్గర ఇండియా, చైనా సైనికులు ఘర్షణకు దిగినట్టు సమాచారం. ఈ నెల 9న వాస్తవాధీన రేఖ (LAC) దగ్గర ఈ ఘర్షణ జరిగినట్టు చెబుతున్నారు. ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఎల్ఏసీ సమీపంలోకి చైనా సైనికులు రాగా.. భారత బలగాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. అది ఘర్షణకు దారి తీసిందని అంటున్నారు.
ఘర్షణ విషయం తెలిసిన వెంటనే రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేలా.. సైన్యాన్ని LAC నుంచి వెనక్కి రప్పించారు. ప్రస్తుతం బోర్డర్ లో ప్రశాంతత నెలకొన్నా.. పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు.
జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ గొడవలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది చైనా సైనికులు చనిపోయినట్టు వెల్లడైంది. ఆ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇండియా, చైనాలు సరిహద్దుల దగ్గర భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. భారత్ రఫేల్ ఫైటర్ జెట్స్ ను సైతం చైనా బోర్డర్ కు తరలించింది. పలు దఫాల చర్చల తర్వాత.. రెండు దేశాలు LAC నుంచి తమ సైన్యాన్ని విత్ డ్రా చేసుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో గల్వాన్ తరహా ఘటన జరగడంతో సరిహద్దులో మళ్లీ హైటెన్షన్.