PM Modi Flag Hoisting Independence Day: 78వ స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా ప్రధాని రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట ప్రాంగణానికి చేరుకున్న ఆయన..త్రివిధ దళాల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం జెండాను ఎగురవేశారు.
ఈ మేరకు భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. అలాగే పలు సైనిక విభాగాల కావాతులు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్, కేంద్రమంత్రులతోపాటు సుమారు 6వేల మంది అతిథులు హాజరయ్యారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుండామని పిలుపునిచ్చారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు.
దేశవ్యాపంగా హర్ ఘర్ తిరంగా పేరుతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. మహనీయుల త్యాగాలకు దేశం రుణపడి ఉందన్నారు. స్వాత్రంత్య్రం కోసం 40కోట్ల మంది పోరాడరని, ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందన్నారు. మనమంతా వారి కలలను సాకారం చేయాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు.
2047 వికసిత్ భారత్ థీమ్తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని, మనం అనుకుంటే అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 నినాదం..140 కోట్ల మంది కలల తీర్మానమన్నారు.
ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని, దేశాభివృద్ధి పాలన, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. అంతరిక్షంలో భారత్ స్పేష్ స్టేషన్ త్వరలో సాకారం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు.