జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా జస్రోటా ప్రాంతంలో ఆదివారం కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీ జరిగింది. అయితే ఖర్గే ప్రసంగిస్తున్నప్పుడు ఆయన అనారోగ్యానికి లోనయ్యారు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆయనకు సపర్యలు చేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, స్థిరంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు గులాం అహ్మద్ మీర్ తెలిపారు.
తర్వాత తన ప్రసంగం కొనసాగించిన ఖర్గే, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఇప్పుడు 83 సంవత్సరాలు. మోదీని గద్దె దించె వరకు తన ప్రాణం పోదని, తాను బతికే ఉంటానన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఖర్గే జస్రోటాకు వెళ్లారు. అంతకుముందు కతువాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్కు ఖర్గే నివాళులర్పించారు. అక్కడ ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడగా, ఒక ఉగ్రవాది మరణించారు.
also read : తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
ఖర్గే ఆరోగ్యంపై అతని కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జమ్మూ కాశ్మీర్లో జస్రోటాలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. దీంతో ఆయన వైద్య బృందం చికిత్స చేసిందన్నారు. ఖర్గేకు రక్తపోటు తగ్గిందని, ప్రస్తుతం బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.