New Parliament Building : నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రధాని మోదీ లోనికి ప్రవేశించారు. గణపతి హోమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం.. సెంగోల్ను మోదీ స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్ను లోక్సభలో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని సత్కరించారు . వారికి జ్ఞాపికలు అందజేశారు. పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.
భారతదేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఈ కార్మికులే నిర్మాతలని మోదీ ప్రశంసించారు. వారి చెమట చుక్కలతో ఈ భవనం రూపుదిద్దుకుందని తెలిపారు. వారిని సన్మానించడం తన అదృష్టమన్నారు. కార్మికులు, వారికి భోజనాలు అందించిన వారిని.. స్వచ్ఛత బాధ్యతలు తీసుకున్నవారిని.. చాయ్ అందించిన వారిని.. ఫిట్టింగ్ కార్మికులను, కలర్ వేసిన కార్మికులను, ఫ్లోరింగ్ చేసిన వారిని, మెకానిక్లను ఇలా అన్ని విభాగాల కార్మికులను సన్మానించారు .