Chennai Airport : ప్రధాని మోదీ చెన్నై విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను ప్రారంభించారు. రూ.1,250 కోట్ల నిధులతో ఈ టెర్మినల్ నిర్మించారు. రెండు దశల్లో చెన్నై విమానాశ్రయాన్ని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది.
టెర్మినల్ ప్రత్యేకతలివే..
నూతన టెర్మినల్ వల్ల ప్రయాణికుల రాకపోకలు ఏడాదికి 23 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 100 చెక్ ఇన్ కౌంటర్లు, 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 17 ఎస్కలేటర్లు, 17 ఎలివేటర్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఏటా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా దీని నిర్మించారు. మొత్తం 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను రెండు భాగాలు విభజించారు. ఇక్కడి నుంచి వెళ్లేవారి కోసం 54 కౌంటర్లు, విదేశాల నుంచి వచ్చే వారి కోసం 54 కౌంటర్లను వినియోగించనున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
దక్షిణాది సంస్కృతికి అద్దం పట్టేలా..
నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను దక్షిణాది సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించారు. ఇళ్లలో ప్రవేశ ద్వారాల వద్ద కనిపించే రంగోళి, కోలం లాంటి గుర్తులను ఏర్పాటు చేశారు. చీరలు, దేవాలయ నమూనాలు టెర్మినల్లో కనిపిస్తాయి. పర్యావరణ హితంగా ఉండేలా టెర్మినల్ ను తీర్చిదిద్దారు.
వందే భారత్ రైలు ప్రారంభోత్సవం..
చెన్నై-కోయంబత్తూర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో కాసేపు మోదీ ముచ్చటించారు.