Delhi: రోడ్డుపై వెళ్లుతున్నప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు చాలా సార్లు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఎదుటి వాహనం మన వాహనానికి సమీపంగా వచ్చి దాదాపుగా ఢీకొట్టినట్టుగానే వచ్చి ఆగిపోతాయి. లేదా పక్కకు వెళ్లిపోవడం చూస్తూ ఉంటాం. చాలా సార్లు ఇలాంటి సందర్భాల్లో వాదులాటలు జరుగుతాయి. ఒకరినొకరు మాటలు అనుకున్నాక అంతే త్వరగా ఎవరి దారిన వారు వెళ్లిపోతుంటారు. కానీ, ఢిల్లీలో ఇలాగే ఓ గొడవ జరిగినప్పుడు ఏకంగా ఓ హత్యే జరిగిపోయింది.
30 ఏళ్ల సిమ్రన్జీత్ కౌర్ తన భర్త హీరా సింగ్తో కలిసి మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో మౌజ్పూర్ వైపు వెళ్లుతున్నారు. నాలుగేళ్లు, 12 ఏళ్ల పిల్లలతో వారు బైక్ పై వెళ్లుతున్నారు. ఇంతలో ఓ బైక్ వారికి దగ్గరగా వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది. దీంతో హీరా సింగ్ బైక్ ఆపి.. ఎదుటి వారితో గొడవకు దిగాడు. గోకల్పురి ఫ్లై ఓవర్ దగ్గర వారు గొడవపడ్డారు.
Also Read: వెనిజుల దేశాధ్యక్షుడికి ఎలన్ మస్క్కు మధ్య మాటల యుద్ధం
ఆ తర్వాత ఫ్లై ఓవర్ మొదలు నుంచి సుమారు 30 నుంచి 35 అడుగుల దూరం నుంచి స్కూటర్ పై ఉన్న ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.. అందులో ఓ బుల్లెట్ తన భార్య ఛాతిలోకి దూసుకెళ్లిందని హీరా సింగ్ పోలీసులకు తెలిపారు. వెంటనే ఆమెను జీటీబీ హాస్పిటల్ తీసుకెళ్లాడు. కానీ, అప్పటికే కౌర్ మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.