Water Crisis in Bengaluru : మనిషి ఆనందంగా జీవించడానికి కావలసిన కనీస వనరులు.. గాలి, నీరు, ఆహారం. వీటిలో ఏది లేకపోయినా బ్రతకడం కష్టం. వేసవి వచ్చిందంటే చాలు.. నీటి కష్టాలు మొదలవుతాయి. ఈసారి బెంగళూరు వాసులు.. ఎన్నడూ లేనంత నీటి కరువును ఎదుర్కొంటున్నారు. తాగడానికి, కనీస అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి. రోజంతా అన్ని అవసరాలు తీరాలంటే.. కనీసం రూ.500 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అక్కడ. దాహార్తిని తీర్చుకునేందుకు గంటల తరబడి ఆర్ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఉదయం నిద్రలేచీ లేవడంతోనే 25 లీటర్ల క్యాన్లను చేతపట్టి.. ఆర్ఓ కేంద్రాల వద్ద ఉద్యోగులు బారులు తీరుతున్న దృశ్యాలు సాధారణమయ్యాయి. కొందరైతే ఈ నీటి కష్టాలను భరించలేక.. తట్ట, బుట్ట సర్దుకుని కుటుంబంతో సహా.. సొంతూళ్లకు పయనమయ్యారు.
Also Read : ముగిసిన సీడబ్ల్యూసీ భేటి.. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఫిక్స్!
కొన్ని అపార్టుమెంట్లలో అయితే నీటి రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నిర్థిష్ట స్థాయిని మించి నీటిని వాడితే.. జరిమానా తప్పదు. నీటి ట్యాంకర్లను బుక్ చేసినా.. అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. టెక్కీల నీటి కష్టాలు చూసి.. కొన్ని వారాలపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వక తప్పడం లేదు. ఇక్కడ పెళ్లికాని యువకులకు పిల్లనిచ్చేందుకు కూడా వెనుకాడుతున్నారట. అందుకు కారణం నీళ్లేనని తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. కనీస అవసరమైన నీరు లేకుండా.. పిల్లనెలా ఇస్తామంటున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. దీంతో బెంగళూరులో ఉండే యువకులకు నీటి ఎద్దడి వల్ల పెళ్లికావడం కూడా కష్టంగా మారింది.
కర్ణాటక రాజధాని, కూల్ సిటీ అయిన బెంగళూరులో ఈ స్థాయిలో నీటి కష్టాలను చూసి.. హైదరాబాద్ వాసులకు గుబులు మొదలైంది. మార్చి తర్వాత భాగ్యనగరంలోనూ అదే స్థాయిలో నీటి కష్టాలు వస్తాయన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి.
బెంగళూరులో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తిగా విఫలమయ్యారని, ట్యాంకర్ మాఫియాకు లొంగిపోయారని ప్రతిపక్షనేత ఆర్. అశోక్ ఆరోపించారు. బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిలో కూరుకుపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా మొద్దునిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్నారు.