Holiday for Schools and Colleges in Chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్కూల్స్, కాలేజీలకు రేపు సెలవును ప్రకటించారు.
వర్షాలు, తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా స్కూల్స్, కాలేజీలకు రేపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు అక్టోబర్ 15న సెలవు ప్రకటించారు. చెన్నైయ్, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీలకు రేపు సెలవును ప్రకటించారు. ఇటు ఐటీ కంపెనీలకు కూడా సీఎం స్టాలిన్ పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తాయని ఐఎండీ సూచించిన నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలన్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు వారికి ఆ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు.
Also Read: ఈసారి దిల్లీలో టపాసులు అమ్మినా, కొన్నా, కాల్చినా అంతే సంగతులు…ప్రభుత్వం కీలక ఆదేశాలు
సమీక్ష సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించాం. ఇందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశాం. వర్షాలను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ప్రకటించాలని ఆదేశాలను జారీ చేశాను. ఇటు ఐటీ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశాం’ అంటూ సీఎం పేర్కొన్నారు.
‘వర్షాలు కురువనున్నాయన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 990 వాటర్ పంప్స్, 57 ట్రాక్టర్లు, 36 మోటార్ బోట్స్, 46 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్, 25 మెట్రిక్ టన్నుల లైమ్ పౌడర్ ను కూడా సిద్ధం చేశాం. అదేవిధంగా 169 క్యాంప్ ఆఫీసులు, 59 జేసీబీలు, 272 ట్రీ కట్టర్స్, 176 వాటర్ డ్రైనర్స్, 130 జనరేటర్స్, 115 లారీలను ఏర్పాటు చేశాం. చెన్నైయ్, తిరువల్లూరు, చెంగల్ పట్టు, కాంచీపురం జిల్లాల కలెక్టర్లు, అధికారులు అలర్ట్ గా ఉన్నారు’ అంటూ సంబంధిత అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
తమిళనాడులో నేడు, రేపు, ఎల్లుండి భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. పుదుచ్చేరి, కరికల్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశమున్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వాతావరణ శాఖ చేసిన తాజా సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు చర్యలు చేపడుతుంది. ఎటువంటి ప్రాణనష్టం వాటిళ్లకుండా ముందస్తు చర్యలు చేపడుతూ అధికారులను అలర్ట్ చేస్తుంది.