IMD Rainfall and Heat Waves Updates in India: భారత దేశంలో భిన్న వాతావరణం ఏర్పడుతుంది. పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారి ఒడిశాలోని పలు జిల్లాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ -ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఇదే కాకుండా పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపురాలో కూడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం లేకపోలేదని సూచించింది.
రుతుపవనాలు త్వరలోనే కేరళను తాకనున్నాయని .. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1 నుంచి కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా నలుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే, తుఫాను గాలులు, ఉరుముల మెరుపులు, వర్షాలకు సంబంధించి కేరళకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఈ వారమంతా వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది.
అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 25 నుంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇటు ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 నుంచి 115.5 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నది. పశ్చిమ బెంగాల్ తోపాటు మరికొన్ని రాష్ట్రాలు.. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ సూచించింది.
పలు ప్రాంతాల్లో మాత్రం భిన్న వాతావరణం నెలకొంటుంది. గుజరాత్ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లో 45.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ ను జారీ చేసింది. అహ్మదాబాద్ లో రెండురోజులపాటు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటు మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లోని బార్మర్ లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని సిర్సాలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు పంజాబ్ లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భటిండాలో 46.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో పలు ప్రాంతాల్లో ఈనెల 26 వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఈ రాష్ట్రాలలో ఎక్కువమంది వడదెబ్బకు గురయ్యే ఛాన్స్ ఉందని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.