Heavy Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. జమ్మూ- కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ల్లో వరదలు పోటెత్తాయి. దేశరాజధాని ఢిల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్లో భారీ వర్షాలకు ఐదుగురు మృత్యవాత పడ్డారు. పర్యాటక కేంద్రం మనాలీలో వరద ఉద్ధృతికి కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్లోని గంగా నదిలో ఓ కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు నదిలో గల్లంతయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో బియాస్ నదిలో ప్రవాహ దాటికి ఔట్- బంజార్ ప్రాంతాల కలిపే ఉక్కు బ్రిడ్జి కొట్టుకుపోయింది. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండీ- కుల్లూ, మనాలీ- లేహ్, చంబా- పఠాన్కోట్ జాతీయ రహదారులు సహా 700కుపైగా రహదారులపై రాకపోకలను బంద్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో 2రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
జమ్మూ-కశ్మీర్లో వరద తాకిడికి ఎన్హెచ్-44 చాలాచోట్ల దెబ్బతింది. దోడా ప్రాంతంలో బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పూంచ్లో వరదల్లో కొట్టుకుపోయినా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని నాయబ్ సుబేదార్ కుల్దీప్ సింగ్, సిపాయి తెలూ రామ్గా గుర్తించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ, జమ్మూ- కశ్మీర్ ఎల్జీలతో మాట్లాడారు. వర్షాల పరిస్థితులపై ఆరా తీశారు.
జమ్మూ- కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, తూర్పు రాజస్థాన్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. హస్తినకు యెల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
24 గంటల్లో వ్యవధిలో ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయి వర్షాలు 1982 జులై కురిశాయి. 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి.