Heavy Rains in Telugu States: భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. రవాణా సౌకర్యాలు స్తంభించి సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ వరద బాధిత ప్రాంతాల్లో బృందాలుగా పర్యటిస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎంల స్వీయ పర్యవేక్షణతో అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమవుతున్నారు. అయితే కొన్ని చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. అసలు ఏపీ, తెలంగాణల్లో యంత్రాంగం పనితీరుపై వినిపిస్తున్న టాక్ ఏంటి?
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెం మీ వర్షం కురవడంతో .. ఇద్దరు దుర్మరణం చెందగా 21 చెరువులు కట్టలు తెగిపోయాయి. ఇదే విపత్కర స్థితి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నెలకొంది. సీఎం రేవంత్ పర్యవేక్షణలో.. మంత్రులు ఆయా జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ క్రమంలో విపత్కర సమయంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
అటు ఏపీలోనూ వరద సహాయక చర్యల అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ముఖ్యంగా వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శిస్తున్నారు. దగ్గరుండి అధికారులను పరుగులు తీయిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరుగుతుంది. అందుకు కారణమైన కొందరు జగన్ భక్త అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొందరు సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
Also Read: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..
అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి చెప్పారు. జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైసీపీకి అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందన్న వాదన వినిపిస్తుంది. వీఆర్లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురు అధికారులు డ్యూటీకి వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కలిగిస్తున్నారని చర్చ జరుగుతోంది.
వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వీఆర్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలు చేశారంట.. ఆ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారు. ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలన్న సీఎం కోరారు. వీఆర్లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలిపారు. అయితే పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అలా వ్యవహరిస్తున్న జగన్ భక్త అధికారులు ఎప్పటికి మారతారో మరి.