Mumbai Rains: మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ముంబై నగరం జలమయమైంది. నగర వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే నగరానికి నీరు సరఫరా చేసే సరస్సులు కూడా ఉప్పొంగుతున్నాయి.
ముంబై నగరం భారీ వర్షాల కారణంగా పూర్తిగా జలమయం అయింది. ముంబై మహానగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు సరస్సుల్లో రెండు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. మోదక్ – సాగర్ సరస్సు, విహార్ సరస్సు, విహార్ సదస్సు పొంగిపొర్లుతున్నాయని పేర్కొంది. దీంతో సాయన్, చెంబుూర్, అంధేరీ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు శుక్రవారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో , స్పైస్ జెట్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయాలకు బయల్దేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోలంటూ ఇండిగో సంస్థ ప్రయాణికులకు సూచించింది. స్పైస్ జెట్ సైతం ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. భారీ వర్షాలు విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ కారణంగా విమానాల్లో కొన్నింటిని రద్దు చేయడం, మరి కొన్నింటిని దారి మళ్లించడం వంటివి జరుగుతున్నట్లు వెల్లడించింది.
మరో వైపు ముంబై నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.