హిమాచల్ ప్రదేశ్ను కుంభవృష్టి వానలు అతలాకుతలం చేస్తున్నాయి. జనం జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఓ వైపు వరద బీభత్సం, మరోవైపు కొండచరియలు విరిగిపడుతుండడంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు భారత ఆర్మీ సాయం అందిస్తోంది. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 150 మంది పౌరులను రక్షించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
కుంభవృష్టి, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే 21 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
గత మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం కంటే 157 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మొత్తం 1200 రహదారులు దెబ్బతిన్నాయి. దాదాపు 9,600 ఇళ్లు దెబ్బతిన్నాయి. సిమ్లా, సోలన్, మండీ, హమీర్పుర్, కాంగ్రా జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.