Haryana Ex CM Manoharlal Khattar Resigned as MLA: బీజేపీ – జేజేపీ మధ్య పొత్తు బీటలు వారడంతో.. హర్యానా సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ సీట్ల కేటాయింపుల విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే రెండు పార్టీల మధ్య పొత్తు వీడిపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి మండలి సభ్యులు 13 మంది రాజీనామాలు చేయడంతో.. అక్కడి ప్రభుత్వం రద్దయింది. సాయంత్రానికే బీజేపీ కొత్త సీఎం ను ప్రకటించడం, ప్రమాణ స్వీకారం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయ నాయబ్ సింగ్ సైనీ చే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా.. తాజాగా మనోహర్ లాల్ కట్టర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం గమనార్హం. ఆపై బీజేపీ అధిష్ఠానం తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. దాంతో కర్నాల్ లోక్ సభ అభ్యర్థిగా ఖట్టర్ ను బీజేపీ బరిలోకి దింపవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 10 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో జేజేపీ తమకు స్థానాలను ఇవ్వాలని కోరగా.. బీజేపీ కేవలం 1 స్థానం ఇచ్చేందుకు మాత్రమే అంగీకరించింది.
Also Read: కేంద్ర కేబినెట్ ఆఖరి భేటీ.. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తారా ?
దుష్యంత్ చౌతానాలో నేతృత్వంలోని జయనాయక్ జనతాపార్టీ (జేజేపీ)కి బీజేపీకి మధ్య లోక్ సభ సీట్ల షేరింగ్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. జేజేపీ అడిగిన సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో.. అక్కడి జేజేపీ గవర్నమెంట్ కూలిపోయింది. 2019 ఎన్నికల్లో.. 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలిచింది. జేజేపీ 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పట్లో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ పార్టీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం పదవిని కట్టబెట్టింది.