Haryana Election Result 2024: ప్రస్తుతం అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలైనా.. అన్ని రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ లీడర్స్ కూడా అక్కడి ఫలితాలను ఉత్కంఠభరితంగా గమనిస్తున్నారు. నేడు హర్యానా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తోంది. రెండు రాష్ట్రాలలో ఎన్నికలను మాత్రం ఈసీ విజయవంతంగా నిర్వహించింది. జమ్ము కాశ్మీర్ లోని 90 స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించగా, హర్యానాలోని 90 స్థానాలకు మాత్రం ఒకే విడతలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది ఈసీ.
అయితే నేడు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని తెలిపిన ఈసీ, కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా సాగిస్తోంది. ఇప్పటికే పలు స్థానాల గెలుపులను కూడా ఈసీ ప్రకటించింది. హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లలో అధికంగా కాంగ్రెస్ కే ఓటర్లు పట్టం కట్టారంటూ ప్రకటించాయి. అలాగే జమ్ము కాశ్మీర్ లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అంటూ ప్రకటించగా.. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని తెలిపాయి.
ఫలితాల విడుదల సమయం రానే వచ్చింది. హర్యానాలో కొంత సమయం కాంగ్రెస్ హవా.. మరికొంత సమయం బీజేపీ హవా అంటూ వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడంలో ఈసీ విఫలమైందని విమర్శిస్తోంది.
Also Read: Haryana and Jammu & Kashmir: నేడే జమ్మూకశ్మీర్, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ!
ఈసీకి ప్రత్యేక వెబ్ సైట్ ఉంది. ఆ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు ఫలితాలను అప్ డేట్ చేయడం లేదంటూ కాంగ్రెస్ వాదన. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నా.. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. అలాగే ఎన్నికల అధికారులపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ.. ఎన్నికల అబ్జర్వర్స్ పై ఈసీకి ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో హర్యానా కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
సాంకేతిక కారణాలతో వెబ్ సైట్ లో అప్ డేట్ కావడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు విస్తృత ప్రచారం నిర్వహించి, పలు హామీల వర్షం గుప్పించి ఎన్నికలకు వెళ్లాయి. హర్యానాలో హ్యాట్రిక్ సాధించాలన్న తపన బీజేపీ నాయకుల్లో ఉంటే.. ప్రజల మద్దతు తమకే ఉందని, అధికారం తమదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలలో హర్యానా ఫలితాలపై అన్ని రాష్ట్రాల పొలిటికల్ లీడర్స్ ఒక కన్నేసి ఉంచారని చెప్పవచ్చు. ఇంతకు ఈ రెండు రాష్ట్రాలు ఎవరి వశం కానున్నాయో.. ఈసీ ప్రకటన అనంతరం వెల్లడి కావాల్సి ఉంది.