kerala-hamas : పాలస్తీనాకు సంఘీభావంగా కేరళ మళప్పురంలో నిర్వహించిన ర్యాలీ వివాదానికి దారితీసింది. జమాత్-ఏ-ఇస్లామీ యూత్ వింగ్ సాలిడారిటీ యూత్ మూవ్మెంట్(SYM) ఈ ర్యాలీని నిర్వహించింది. అయితే ఆ ర్యాలీనుద్దేశించి హమాస్ మాజీ నేత ఖాలెద్ మిషాల్ వర్చువల్ ప్రసంగం చేయడం దుమారాన్ని రేపింది.
ఖాలెద్ హమాస్ పొలిట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు పొలిట్ బ్యూరోకి చైర్మన్గా వ్యవహరించారు. చాలా కాలం ఆయన హమాస్ కీలక నేతల్లో ఒకరిగా కొనసాగారు. వెస్ట్బ్యాంక్లో జన్మించినా.. పెరిగింది మాత్రం కువైట్, జోర్డాన్లోనే. హమాస్ రాజకీయ నేతగా 2004లో ఆయన ప్రవాస జీవితం గడిపారు.
గాజాలో ఎన్నడూ ఖాలెద్ నివసించలేదు. జోర్డాన్, సిరియా, ఖతర్, ఈజిప్టుల నుంచే ఆపరేషన్లు నిర్వహించేవారు. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించిన ప్రకారం ఆయన ప్రస్తుతం ఖతర్లో స్థిరపడ్డారు. ఆయన ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లు అని ఇజ్రాయెల్ వెల్లడించింది.
కేరళ ర్యాలీలో ఖాలెద్ వర్చువల్ ప్రసంగం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్నాయి. యూత్ రెసిస్టెన్స్ ర్యాలీనుద్దేశించి ఆయన అరబిక్ భాషలో వర్చువల్గా ప్రసంగించారు. హిందూత్వ, జైనిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలనేది నిర్వాహకులు ఆ ర్యాలీకి పెట్టిన ట్యాగ్ లైన్. ఇదే ఇప్పుడు రాజకీయ రగడకు దారితీసింది.
పాలస్తీనాకు సంఘీభావం నెపంతో టెర్రరిస్టు సంస్థను కీర్తించారని, ఆ సంస్థ నేతలను యోధులని కీర్తించారని బీజేపీ మండిపడింది. హమాస్ మిలిటెంట్ సంస్థ నేత ప్రసంగాన్ని ప్రసారం చేస్తుంటే కేరళ సీఎం పినరయి విజయన్ ఏం చేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ నిలదీశారు.
ఖాలెద్ మిషాల్ వర్చువల్ ప్రసంగం చేస్తే తప్పేముందంటూ నిర్వాహకులు సమర్థించుకున్నారు. భారత్లో హమాస్ నిషేధిత సంస్థ కాదని, అది ఇక్కడ క్రియాశీలంగా లేదని SYM కేరళ అధ్యక్షుడు సీటీ సుహాయిబ్ చెప్పారు. హమాస్ నేత ర్యాలీలో వర్చువల్గా పాల్గొనడం చట్టవిరుద్ధమైన విషయం కూడా కాదని వివరించారు.