Budget 2024 Phases| బడ్జెట్ అనేది ఒక సంత్సరానికి గాను ఏ రంగంలో ఎన్ని నిధుల అవసరం ఉంటుందో అంచనా వేసి.. ఆ రంగాలకు తగిన నిధులు కేటాయింపును రాతపూర్వకంగా చూపించే వార్షిక ఆర్థిక పత్రం. రానున్న ఆర్థిక సంవత్సరానికి జమాఖర్చుల పట్టిక. నీతి ఆయోగ్, ఇతర సంబంధిత శాఖలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ దీనిని సిద్ధం చేస్తుంది. మొత్తం ఆరుదశల్లో బడ్జెట్ రూపకల్పన కోసం భారీ కసరత్తే జరుగుతుంది. ఇదంతా బడ్జెట్ సమర్పణకు ఆరునెలలు ముందుగానే ఆరంభమవుతుంది. ఈ బాధ్యతలన్నీ ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) బడ్జెట్ డివిజన్ చూస్తుంది. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ఆరంభానికి కన్నా ముందే పార్లమెంట్ ఉభయసభలు బడ్జెట్ను ఆమోదించాలి.
వివిధ శాఖల నుంచి అంచనాలకు ఆహ్వానం
బడ్జెట్ రూపకల్పనలో మొదటి దశ అన్ని శాఖల నుంచి అంచనాలు కోరడం. దీని కోసం ఆర్థిక శాఖ సర్క్యులర్లు జారీ చేస్తుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి సంస్థలను అంచనాలు రూపొందించాలని కోరుతుంది. మంత్రిత్వ శాఖలు అంచనాలను రూపొందించడంతో పాటు తమ శాఖల పరిధిలో గత సంవత్సరం ఆదాయ, వ్యయ వివరాలను కూడా సమర్పిస్తాయి.
ప్రతిపాదనలపై శాఖల మధ్య సంప్రదింపులు
అలా అన్ని మూలల నుంచి అందిన అంచనాలు, ప్రతిపాదనలను ఉన్నతాధికారులు సమీక్షిస్తారు. ఇందుకోసం మంత్రిత్వశాఖలు, వ్యయ విభాగం మధ్య భారీ ఎత్తున సంప్రదింపులు జరుగుతాయి. ఆమోదం అనంతరం అవి కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించడం జరుగుతుంది.
కేటాయింపులు
అంచనాలను పరిశీలించిన అనంతరం ఆర్థిక శాఖ.. ఆ ఆర్థిక సంవత్సరానికి అయ్యే ఖర్చుల కోసం నిధులు కేటాయిస్తుంది. ఈ అంశంలో అభ్యంతరాలు ఏవైనా వ్యక్తమైతే.. కేంద్ర మంత్రివర్గం లేదంటే ప్రధానిని ఆర్థిక శాఖ సంప్రదిస్తుంది. అలా వివిధ శాఖలకు నిధుల కేటాయింపు పూర్తవుతుంది. బడ్జెట్ రూపొందించే సమయంలో కీలక సూచనల కోసం అవసరమైతే రైతులు, వాణిజ్య సంస్థల అధిపతులు, విదేశీ సంస్థాగత మదుపరులను డీఈఏ, రెవెన్యూ విభాగం సంప్రదిస్తుంది.
Also Read: కొత్త బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్లో ఏది ఉచితం?
ప్రీబడ్జెట్ మీటింగ్లు
బడ్జెట్ తయారీకి ముందుగానే వివిధ పక్షాలతో ఆర్థిక మంత్రి సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయవేత్తలు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లతో భేటీ అవుతారు. వారి నుంచి డిమాండ్లను, ప్రతిపాదనలను స్వీకరిస్తారు. ప్రీబడ్జెట్ భేటీలు ముగిసిన తర్వాత ఆర్థికమంత్రి అన్ని వైపుల నుంచి వచ్చిన డిమాండ్లను చివరిసారిగా పరిశీలిస్తారు. బడ్జెట్ రూపురేఖలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు ప్రధాన మంత్రితో ఒకసారి విపులంగా చర్చిస్తారు.
హల్వా వేడుక
బడ్జెట్ సమర్పణకు పది రోజుల ముందు హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకతోనే బడ్జెట్ ముద్రణ ఆరంభమవుతుంది. భారత సంప్రదాయం ప్రకారం.. ఏదైనా శుభకార్యాన్ని ఆరంభించే ముందు స్వీట్స్ తింటారు. బడ్జెట్ ముద్రణకు ముందుగా స్వీట్స్ తినడం.. ముఖ్యంగా హల్వా తినడం ఆనవాయితీగా మారింది. ఓ పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి.. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అందరి నోళ్లూ తీపిచేస్తారు. ఆర్థిక మంత్రి, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులు ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ఈ సంప్రదాయానికి కొవిడ్-19 హయాంలో బ్రేక్ పడింది. 2020లో హల్వాను చేయడానికి బదులుగా.. ఆర్థికశాఖ అధికారులు, సిబ్బంది ఉన్న నార్త్బ్లాక్ కే సీట్ల ప్యాకెట్లను పంపారు.
బడ్జెట్ తయారీ చివరి దశలో గోప్యత
హల్వావేడుక జరిగిందంటే బడ్జెట్ ముద్రణ ఆరంభమైనట్టే. దీంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ పది రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉండాలి. బాహ్య ప్రపంచంతో ఇక వారికెలాంటి సంబంధం ఉండదు. బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించేంత వరకు వారంతా అక్కడే ఉంటారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకే ఈ పకడ్బందీ ఏర్పాట్లు. 1950లో బడ్జెట్ వివరాలు లీక్ కావడంతో అప్పటి నుంచి దీనిని తప్పనిసరి చేశారు. ఓ బడ్జెట్ తయారీ వెనుక ఇంతటి భారీ కసరత్తు ఉంటుందన్నమాట. ఆర్థిక మంత్రి పార్లమెంట్కు బడ్జెట్ను సమర్పించడంతో ఆరునెలల ఈ తతంగం పూర్తవుతుంది.