H3N2 Virus : దేశంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ దడ పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇన్ఫ్లుయెంజా ఏ ఉప రకమైన ‘హెచ్3ఎన్2’ వైరస్ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. హర్యానా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ లక్షణాలతో మరణించారని ప్రకటించింది.
కర్ణాటక హసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల హీరే గౌడ హెచ్3ఎన్2 వైరస్ కారణంగా మార్చి 1న మృతిచెందారని ఆ జిల్లా ఆరోగ్య అధికారి ప్రకటించారు. బాధితుడు ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. ఆయన శాంపిల్ను పరీక్ష చేయగా.. హెచ్3ఎన్2 వైరస్ నిర్ధారణ అయినట్లు వివరించారు. మృతుడు హీరే గౌడకు బీపీ, షుగర్ ఉన్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల మరణం సంభవించినట్లు హర్యానా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్ఫ్లుయెంజా కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధివల్ల బాధితులు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్లే రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫ్లుయెంజా మరో రకమైన హెచ్1ఎన్1 కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి ఈ వైరస్ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతోంది. దగ్గు మాత్రం 3 వారాల వరకు రోగులను వేధిస్తోంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.