Influenza Virus : రెండేళ్లుపైగా కోవిడ్ తో భారత్ విలవిల లాడింది. దేశం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటోంది. ఆ వైరస్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నుంచి బయటపడుతున్న సమయంలో మరో వైరస్ దడ పుట్టిస్తోంది. H3N2 ఇన్ఫ్లూయెంజా వైరస్ కలవర పెడుతోంది. దేశవ్యాప్తంగా ఈ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్ ను ఈ వైరస్ వణికిస్తోంది. కాన్పూర్ హాల్లెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజులోనే 200 కేసులు వెలుగుచూశాయి. రోగులు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది రోగులకు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
కాన్పూర్ లోని హాల్లెట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోయింది. ఏటా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఇన్ ఫ్లూయెంజా కేసులు వస్తాయని ఆసుపత్రి మెడిసిన్ డిపార్ట్మెంట్ అధిపతి రిచా గిరి తెలిపారు. అయితే ఈ సారి రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయని తెలిపారు. బాధితులకు ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. వారిలో కొందరికి బైపాప్ యంత్రం కూడా వాడాల్సి వచ్చిందని వివరించారు.
మరోవైపు కాన్పూర్ లో ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వర బాధితులు పోటెత్తారు. ఇన్ఫ్లూయెంజా ఎ వైరస్కు ఉపరకంగా భావిస్తున్న H3N2 వైరస్ నెల రోజులుగా తీవ్రంగా వ్యాపించిందని వెైద్యనిపుణులు చెబుతున్నారు. రోగుల్లో ఐదు నుంచి ఆరు రోజులపాటు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా H3N2 ఇన్ఫ్లూయెంజా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో సగం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారే ఉంటున్నారు. హెచ్3ఎన్2 రకం వైరస్ కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది. హెచ్3ఎన్2 ఉపరకాలు సాధారణ ఇన్ఫ్లూయెంజా వేరియంట్ల కంటే బలంగా ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ వైరస్ సోకిన 92 శాతం మంది రోగుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి. ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు 3 వారాల వరకు ఉంటోంది. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.