Gyanvapi case : జ్ఞానవాపి కేసుపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి న్యాయస్థానాన్ని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదుపై నలుగురు హిందూ మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఆరోపించారు. ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని న్యాయస్థానాన్ని తమ పిటిషన్లలో కోరారు.
ఆ పిటిషన్లపై వారణాసి కోర్టు విచారణ చేసింది. శాస్త్రీయ సర్వేను మసీదు ప్రాంగణంలో చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర ఆధునిక పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే చేపట్టాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.
మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలని దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాయి. అయితే ఈ పిటిషన్లను తాజాగా న్యాయస్థానం కొట్టివేసింది.
మరోవైపు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై చేపట్టిన సర్వే పూర్తి అయ్యింది. పురావాస్తుశాఖ స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ్.. సీల్డ్ కవర్లో ఉన్న రిపోర్టును వారణాసి కోర్టు న్యాయమూర్తి ఏకె మిశ్రాకి అందించారు.
జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించడానికి ముందు అక్కడ హిందూ ఆలయం ఉండేదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఏఎస్ఐ ఈ శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. శాస్త్రీయ సర్వేకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించడం జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్ధించడంతో హైకోర్టు తీర్పును జ్ఞానవాపి కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శాస్త్రీయ సర్వే జరిగింది.