అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అలాగే ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను హత్య చేస్తానని పన్నూ తెలిపినట్లు సమాచారం. శుక్రవారం ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ముగ్గురు ఖలిస్తానీ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పన్నూ హెచ్చరించాడు.
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను సెక్యూరిటీ ఏజెన్సీలు వేధింపులకు గురి చేయవద్దని పన్నూ పేర్కొన్నాడు.
బ్రిటన్కు చెందిన ఓ నంబరు నుంచి ఈ రికార్డింగ్ మెసేజ్ వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘావర్గాల సమాచారం మేరకు.. ఖలిస్తానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ ఏటీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురిలో ఒకరిని రాజస్థాన్కు చెందిన సీకర్ వాసి ధరమ్వీర్గా ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను హత్య చేస్తానని బెదిరిస్తూ పన్నూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశాడు. తాజాగా అయోధ్యలో విధ్వంసం అంటూ ఆడియో రిలీజ్ చెయ్యడంతో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి.