Sweden : రెండు దశాబ్దాల క్రితం వరకు కాల్పులు అంటే ఏమిటో స్వీడన్ పౌరులకు తెలియదు. యూరప్లో కాల్పుల మృతుల సంఖ్య అత్వల్పంగా ఉన్న దేశం అదే. 2021 నాటికి ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది.
స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైం ప్రివెన్షన్..BRA నివేదిక మేరకు ప్రతి పది లక్షల మందిలో నలుగురు తుపాకీ తూటాలకు బలవుతున్నారు. యూరప్ సగటు మరణాలు 1.6 కన్నా ఇది చాలా ఎక్కువ.
నిరుడు తుపాకీ హింసకు 62 మంది బలయ్యారు. 2017లో ఈ సంఖ్య 36 మాత్రమే. అక్కడ నుంచి గన్ వయొలెన్స్ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 2018లో 43 మంది, 2019లో 45, 2020లో 47, 2021లో 45 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. క్రిమినల్ గ్యాంగ్ల పోరు, ఉగ్రదాడుల తరహా ఘటనల కారణంగా గత నెలలోనే 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో కలవరపడిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. తుపాకీ కాల్పులు, హింసను అరికట్టడంలో పోలీసులకు సాయం చేయాలని సైనికాధికారులను ఆదేశించారు.