Rahul Gandhi news update(Latest political news in India): రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసిన కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రాచ్చక్ తీర్పును వెల్లడించారు. సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ కు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.
2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను నిరశిస్తూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సూరత్ కోర్టు విచారణ చేపట్టింది. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రోజే పార్లమెంట్ సచివాలయం రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో రాహుల్ సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును.. అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. అయితే అదనపు కోర్టు కూడా రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సమర్థించింది. దీంతో రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టుకు కూడా ఆ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.