Gujarat Elections Modi Campaign : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్, 5న రెండో దశ పోలింగ్ జరగనుంది. తొలి ఫేజ్ పోలింగ్కు ఇంకా పది రోజుల టైం మాత్రమే ఉండడంతో పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా చెమటోడుస్తున్నాయి. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయిన్ ప్రధాని మోడీ కూడా సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల కదన రంగంలోకి దూకారు. గుజరాత్ ఎన్నికల కోసం.. మోడీ ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది. మొత్తం 25 సభల్లో పాల్గొని.. మెరుపు ప్రచారం చేయబోతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు గుజరాత్ను చుట్టేయబోతున్నారు.
శనివారం సాయంత్రంతో గుజరాత్లో మోడీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అవుతుంది. తొలుత వల్సాడ్లో ఎన్నికల ప్రచారం చేస్తారు మోడీ. 20న సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సౌరాష్ట్ర ప్రాంతంలో మొత్తం నాలుగు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలో బీజేపీకి పెద్దగా సీట్లు రాలేదు. దీంతో అక్కడ కాస్త ఎక్కువ దృష్టి పెట్టారు మోడీ. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ 40మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ను ప్రకటించింది. వాళ్లంతా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మోడీతో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. డిసెంబర్ 1న తొలిదశ, 5న రెండో దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.