Adani : తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న భారీ పునర్నిర్మాణ ప్రాజెక్టు ధారావిలో కదలిక వచ్చింది. ముంబై స్లమ్ రీహ్యాబిలిటేషన్ అథారిటీతో కలిసి భారత బిలియనీర్ గౌతం అదానీ చేపడుతున్న జాయింట్ వెంచర్ ఇది. సోషల్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టడంలో విశేష అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్, అమెరికాకు చెందిన ప్రముఖ డిజైన్ కంపెనీ ససాకీ, బ్రిటన్ కన్సల్టెన్సీ సంస్థ బ్యురో హెపాల్డ్ భాగస్వామ్యంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్(DRPPL) అధికారులు వెల్లడించారు.
న్యూయార్క్ సెంట్రల్ పార్క్లో మూడొంతుల మేర ధారావి విస్తీర్ణం ఉంటుంది. 2.1 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మురికివాడ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్లమ్. ఆసియాలో రెండో అతిపెద్ద మురికివాడ. ఇక్కడ జనసాంద్ర అధికం.625 ఎకరాల్లో విస్తరించిన ధారావిలో పదిలక్షల మంది నివసిస్తున్నారు.దీనిని పునర్నిర్మించాలనేది దశాబ్దాల నాటి కల.
దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై నడిబొడ్డున ఉన్న ధారావిలో జీవనం అత్యంత దుర్భరంగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న వారిలో చాలా మందికి నీటి వసతి కూడా సరిగా ఉండదు. మురికివాడ పునర్నిర్మాణం కత్తి మీద సామే అయినా.. ధారావిని సుందర నగరంగా తీర్చిదిద్దాలని 1980లలో యోచించారు. ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సర్కారు తొలిసారిగా 2008లో డెవలపర్ల కోసం అన్వేషణ ఆరంభించింది. కానీ 2004-2014 మధ్య ధారావి వాసులు పునర్నిర్మాణ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు.
చివరకు ఈ ప్రాజెక్టు అపరకుబేరుడు అదానీకి దక్కింది. అదానీ 619 మిలియన్ డాలర్ల బిడ్ను నిరుడు జూలైలో మహారాష్ట్ర సర్కారు ఆమోదించింది. అదే నెలలో DRPPL ఏర్పాటైంది. మోదీకి సన్నిహితుడైనందునే అదానీకి ధారావి ప్రాజెక్టును కట్టబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే టెండర్ల ఖరారులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలు బహిర్గతమైన దరిమిలా ప్రాజెక్టు అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గత నెలలో ముంబైలోని అదానీ కార్యాలయాల వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శించారు.