Rajasthan: రాజస్తాన్ లోపెళ్లి వేడుక తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహ విందు కోసం వంటలు తయారు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారి రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్స్యువాత పడ్డారు. సుమారు 60 మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ప్రమాదం రాజస్తాన్లోని జోథ్పూర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుంగ్రా గ్రామంలో జరిగింది.
గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి పెళ్లి జరుగుతున్న ఇంటిలోని ఓ భాగం కుప్పకూలింది. తీవ్ర స్థాయి పేలుడు సంభవించిందని అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సాయంత్రం గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్యాస్ సిలిండర్ల పేలుడుతో పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మీయులను కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.