Amritpal: తలపాగా ధరించడాన్ని సిక్కులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి తలపాగా కూడా ధరించడానికి ఇష్టపడని వ్యక్తి అమృత్పాల్ సింగ్. మోడ్రన్ లైఫ్ స్టైల్ అతనిది. ఎవరికీ అంత పరిచయం ఉండేది కాదు. పబ్లిక్తో అనుబంధం శూన్యం. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకునేవాడు. దుబాయ్లో ఉండేవాడు. అదంతా ఏడాది క్రితం వరకు.
29 ఏళ్ల వయసు. ఉడుకు రక్తం, దూకుడు మనస్తత్వం, చుట్టూ ప్రైవేట్ ఆర్మీ, అన్నీ కాంట్రోవర్శియల్ స్పీచ్ లు.., బెదిరింపులు, తనకు ఎదురేలేదన్నట్లుగా ప్రవర్తన. ఇదీ ఇప్పటి అమృత్ పాల్ సింగ్.
గత సంవత్సర కాలంలో అమృత్పాల్ సింగ్ మోస్ వాంటెడ్గా మారిపోయాడు. నా అంతటి వాడు లేడంటూ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి.. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్ దీప్సిద్ధూ. అతని మరణంతో అమృత్పాల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతని జీవితమే మారిపోయింది.
చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురైపోతున్న దీప్ సిద్ధూ అనుచరులను తనకు అనుకూలంగా మార్చుకుని నాయకుడు అయిపోయాడు అమృత్పాల్ సింగ్. తనను తాను ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు నాయకుడినని ప్రకటించుకొన్నాడు. సిద్ధూ కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. కట్ చేస్తే.. అమృత్పాల్ మాత్రం పాపులర్ అయ్యాడు.
సాధారణంగా ఖలిస్తానీ ఉద్యమకారులు విదేశాల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. కానీ అమృత్పాల్ సింగ్ మాత్రం పంజాబ్ కేంద్రంగా తన ఉద్యమం కొనసాగించాడు. హేట్ స్పీచ్లతో పాపులారిటీ పొందాడు. ఖలిస్తానీ ఉద్యమకారులను త్వరగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’, ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’, ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ అంటూ.. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్లడంతో.. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు అమృత్పాల్ సింగ్ ఆట కట్టింది.
ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్లో పంజాబ్ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వాన్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్ వాలేను 1984లో స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. ఆ తర్వాత నీరుగారిన ఆ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసేందుకు అమృత్పాల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అందుకే అతన్ని అభినవ భింద్రన్ వాలేగా పిలుచుకుంటున్నారు అనుచరులు.
అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు. వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలు .
కొన్ని వారాల నుంచి అమృత్పాల్ సింగ్ అరాచకాలు పెరిగిపోయాయి. అమృత్సర్ శివార్లలో ఏకంగా పోలీస్ స్టేషన్పై దాడికి తెకబడ్డారంటే వాళ్ల ఓవరాక్షన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని.. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ మాన్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. కేంద్ర హోంశాఖ పూర్తిగా సహకరించింది. అమృత్పాల్ సింగ్, అతను ముఖ్య అనుచరులపై నిఘా పెట్టారు. శనివారం ఉదయం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు పోలీసులు. పంజాబ్ స్పెషల్ పోలీస్ టీమ్స్, CRPF రాపిడ్ యాక్సన్ ఫోర్సెస్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 19వేల మంది సిబ్బంది అమృత్పాల్ సింగ్ కోసం వేట మొదలుపెట్టారు.
జలంధర్లో అమృత్పాల్ సింగ్ ముఖ్య అనుచరులను పట్టుకోవడం పోలీసుల ఆపరేషన్లో కీలక మలుపు. వాళ్లిచ్చిన సమాచారం బాగా ఉపయోగపడింది. పోలీసుల వేట మామూలుగా సాగలేదు. జాతీయ రహదారిపై, పొలాల్లో ఒక్కొక్కరినీ వెంటాడుతూ పట్టుకున్నారు. ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు.
అమృత్పాల్ సింగ్ను పట్టుకోవడంలో ఏకంగా 8 జిల్లాల పోలీసులు యాక్షన్ సీన్లోకి దిగారు. అమృత్ భాయ్ వెనుక పోలీసులు పడ్డారు.. ఎనీ టైమ్ పట్టేసేలా ఉన్నారంటూ.. ఆయన అనుచరులు మిగతావారిని అలర్ట్ చేస్తూ వచ్చారు. ఫేస్ బుక్లో లైవ్ పెట్టారు. కానీ.. అప్పటికే అమృత్పాల్ సింగ్ను పోలీసు బలగాలు అష్ట దిగ్బంధం చేశాయి. తప్పించుకునేందుకు వీల్లేకుండా పట్టేశారు. భారీ ఆపరేషన్ ప్రస్తుతానికి విజయవంతం అయింది.
పంజాబ్లో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పంజాబ్వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను ఆదివారం వరకు నిలిపివేశారు. ప్రస్తుతం పంజాబ్లో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి.