Ravisutanjani Kumar | ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై లక్షల, కోట్ల మంది సెలెబ్రిటీలు, ప్రతిభావంతులు, నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులను ఫాలో అవుతున్నారు. ఈ సెలెబ్రిటీలు ఏం పోస్ట్ చేసినా వాటికి లైక్ చేస్తారు.. రిప్లై ఇస్తారు. వారినే ఆదర్శంగా తీసుకుంటారు.
ఇలాంటి వారిలో రవిసుతంజనీ కుమార్ అనే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయన్సర్ ఒకడు. అతనికి ట్విట్టర్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలో అయ్యేవారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇండియా యూపీఐ లావాదేవీల టెక్నాలజీని రవి చాలా ప్రమోట్ చేశాడు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఇతనిని ఎంతో అభినందించారు. ఇలాంటి వారు భారత్ భవిష్యత్తు అని కితాబిచ్చారు. రవిసుతంజనీ కుమార్ నిజానికి ఒక రైట్ వింగ్ (ఆర్ఎస్ఎస్, బిజేపీ, బజ్రంగ్ దళ్) కార్యకర్త.
కట్ చేస్తే.. సెప్టెంబర్ 2023లో రవిసుతంజనీ కుమార్ ఒక ఫ్రాడ్(మోసగాడు)అని తేలింది. రవి తన వద్ద IIT, MIT, లాంటి దిగ్గజ విద్యాసంస్థల నుంచి పొందిన ఇంజనీరింగ్, కంప్యూటర్ మాస్టర్స్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ కోర్సుల 11 డిగ్రీలు ఉన్నట్లు చెప్పుకొని ఒక ఫిన్ టెక్ ఇన్ఫ్లుయన్సర్ గా అవతారమెత్తాడు. మార్కెట్లో పెట్టుబడుల కోసం కన్సల్టెన్సీ పెట్టాడు. డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ జింజర్ మంకీ అనే కంపెనీలో పెద్ద పదవి కూడా పొందాడు. జనాల వద్ద భారీగా డబ్బులు తీసుకొన్నాడు.
కానీ 2023లో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అనే కార్యక్రమం ముంబైలో జరిగినప్పుడు.. అక్కడ ఈ రవిసుతంజనీ కుమార్ గురించి అసలు విషయం బయటపడింది. అసలు ఇతని వద్ద ఏ డిగ్రీలు లేవని.. ఇతను చూపించినవన్నీ నకిలీవని తెలిసింది. ఇదంతా బాగా వైరల్ కావడంతో అతడిని ఫాలో చేసే వారు, అతడిని ఆదర్శంగా భావించావారు.. అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
వెంటనే రవిసుతంజనీ కుమార్ తన ట్విట్టర్, లింక్ డిన్ అకౌంట్స్ డిలీట్ చేశాడు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు జింజర్ మంకీ కంపెనీ చీఫ్ అభిషేక్ ఆస్థానా తెలిపారు. ఇంతకాలం అతను కంపెనీలో ఏ పనీ సక్రమంగా చేయలేదని.. అతడి వద్ద ఏ నైపుణ్యం లేదని చెప్పారు.
రవిసుతంజనీ కుమార్ నిజానికి ఒక డిప్లొమా డిగ్రీ హోల్డర్. అది కూడా మిర్జాపూర్ ఐటిఐ నుంచి వైర్ మెన్ కోర్సు డిగ్రీ.
ఇంతకుముందు రవిసుతంజనీ కుమార్ భారత దేశంలో రిజర్వేషన్ తీసేయాలని.. దీని వల్ల దేశంలో టాలెంట్ ఉన్నవాళ్లకు తీరని అన్యాయం జరుగుతోందని పలుమార్లు ట్వీట్లు చేశాడు. కానీ రవి తన ఎడ్యుకేషన్ పూర్తి చేయడానికి ఒక షెడ్యూల్డ్ కులం సర్టిఫికెట్ ఉపయోగించాడు.
అయితే రవిసుతంజని కుమార్ ఇటీవలే మళ్లీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యాడు. ఈసారి అతడిని ఫాలో అయ్యే ముందు జాగ్రత్తగా ఉండాలని పలువురు పోస్టులు పెడుతున్నారు.