America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సౌత్ఈస్ట్ వాషింగ్టన్లోని అనకోస్టియా ప్రాంతంలో గుడ్హోప్ రోడ్లో దుండగుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
సౌత్ఈస్ట్ వాషింగ్టన్లోని అనకోస్టియా ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
వాషింగ్టన్లో ఈ ఏడాది ఇప్పటికే అనేక కాల్పుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు 150 మందికిపైగా మృత్యువాతపడ్డారు. 2 దశాబ్దాల తర్వాత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వాష్టింగన్ పోస్ట్ తెలిపింది. ఆగస్టులో ఇప్పటివరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలను ఉన్మాదులు బలి తీసుకుంటారు. షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆడిటోరియాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు.