Exam Hall: రాజస్తాన్లో ఓపెన్ 10వ, 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రాజస్తాన్ విద్యా శాఖకు చెందిన విజిలెన్స్ స్క్వాడ్లు తమ పనిని సమర్థవంతంగా చేయడంతో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. రాజస్తాన్లోని దేచు (కోలు గ్రామం)లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ పరీక్షలు జరుగుతుండగా విజిలెన్స్ స్క్వాడ్లు అక్కడికి వెళ్లారు. కానీ, ఆశ్చర్యకరంగా స్కూల్ గేట్లకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఆ స్క్వాడ్లు ఏకంగా గోడ దూకి టైం వేస్ట్ చేయకుండా నేరుగా ఎగ్జామ్ హాల్స్ వైపు వెళ్లారు. కెమెరా ఆన్ చేసి అన్ని ఎగ్జామ్ హాల్స్ చుట్టేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో వారు ఊహించని దృశ్యాలు కనిపించాయి.
స్థానికుల నుంచి తమకు కొంత సమాచారం అందగానే.. వెంటనే ఈ స్కూల్ వద్దకు వచ్చామని స్క్వాడ్ టీమ్ తెలిపింది. గేట్లకు లాక్ వేసి ఉండటంతో గోడ దూకి లోనికి వెళ్లామని వివరించింది. పరీక్షా కేంద్రాల్లో టీచర్లే మాస్ చీటింగ్ నిర్వహిస్తున్నారని, బ్లాక్ బోర్డులపై టీచర్లు సమాధానాలు రాస్తే.. విద్యార్థులు వాటిని ఆన్సర్ షీట్లలో రాసుకుంటున్నారని చెప్పింది.
అంతేకాదు, డబ్బుల బేరాల ఉదంతాలు బయటికి వచ్చాయని ఆ టీమ్ వివరించింది. కొందరు స్టూడెంట్ల వద్ద రూ. 2 వేలు లభించాయని, మరికొందరు రూ. 2,100 టీచర్లకు ఇవ్వడానికి డీల్ చేసుకున్నారని చెప్పినట్టు తెలిపింది. తద్వార ఆ టీచర్లు చీటింగ్లో విద్యార్థులకు సహకరించాలనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది.
Also Read: భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు.. అయినా పెళ్లికి హాజరైన అతిథులు..
మరింత దర్యాప్తు చేయగా.. ఇద్దరు టీచర్లు చీటింగ్కు అవకాశం కల్పించడమే కాదు.. ఏకంగా వారే వేరే ఇద్దరు స్టూడెంట్లకు బదులు పరీక్ష రాస్తున్నట్టు తేలింది. వారిద్దరూ డమ్మీ క్యాండిడేట్లుగా పరీక్ష రాస్తున్నారని ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ తెలిపింది. దీంతో స్థానిక అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు స్కూల్కు వచ్చారు. ఇంతలో ఆ డమ్మీ క్యాండిడేట్లు తప్పించుకున్నారు.
ఈ ఘటనపై రాజస్తాన్ విద్యా శాఖ స్పందించింది. స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర సింగ్ చౌహాన్ సహా పది మంది టీచర్లపై కేసు నమోదు చేసినట్టు వివరించింది. తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపింది. కొందరు ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేసి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నామని వివరించింది.