Chennai airport latest news(Today news paper telugu): చెన్నై విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం 35 మంది పాసింజర్స్ ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసింది. బాధిత ప్రయాణికులు ఎయిర్ పోర్టులో నిరసనకు దిగారు. 7 గంటల 45 నిమిషాలకు ఎయిర్ అరేబియా ప్యాసింజర్ విమానంలో చెన్నై నుంచి అబుదాబికి 182 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం అబుదాబి నుంచి చెన్నైకి 7 గంటలకు రావాలి. కానీ వర్షం కారణంగా బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అయితే, ప్యాసింజర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫ్లైట్ ఆలస్యం అవుతోందని అని మాత్రమే మెసెజ్ చేశారు. దీంతో.. విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు ఫ్లైట్ కోసం ఎదురు చూశారు. 182 మంది ప్రయాణికుల్లో 35 మంది ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. చాలా సమయం ఎదురు చూసిన ఈ 35 మంది.. ఎయిర్ పోర్టు సిబ్బందిని అడగ్గా 12 గంటల 18 నిమిషాలకే విమానం వెళ్లి పోయిందని చెప్పారు. గంట క్రితం విమానం బయలు దేరితే ఇంత వరకు ఏం చేస్తున్నారని తిరిగి ప్రశ్నించారు. బుకింగ్ క్యాన్సిల్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మంది ప్రయాణికులు లేకుండా.. వారికి సమాచారం కూడా ఇవ్వకుండా విమానం ఎలా బయలుదేరుతుందని మండిపడ్డారు. 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 12 గంటల 18 నిమిషాలకు బయలు దేరితే ప్రయాణికులను అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. 35 మంది ఎయిర్ పోర్టులో ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్టు వదిలి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్లైన్స్ ఉన్నతాధికారికి, చెన్నై విమానాశ్రయ అధికారులకు, చెన్నై విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.