Flash floods on rise in Himachal Pradesh highways are closed : హిమాచల్ ప్రదేశ్ కు వానగండం తప్పడం లేదు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ,అతి భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో రహదారులే కొట్టుకుపోతున్నాయి. కొన్ని ఏరియాలలో పూర్తిగా ఇతర ప్రాంతాలతో సంబంధబాంధవ్యాలు తెగిపోయాయి. కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేక..ఫోన్ సిగ్నల్స్ పనిచేయక నానా అవస్థలు పడుతున్నారు పౌరులు. అయితే ఈ మధ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు వరుణుడు. మళ్లీ శనివారం నుంచి విజృంభించాడు. మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా కొండ చరియలు విరిగిపడే రహదారులను గుర్తించి దాదాపు 58 రోడ్లు వరకూ రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఈ నెల 20 దాకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యారు అధికారులు.
యాపిల్ తోటలు ధ్వంసం
ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు సెలవలు రద్దు చేసింది. విపత్తు నివారణ చర్యలలో భాగంగా కొండ దిగువ ప్రాంతాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. రాగల 48 గంటలలో 12 జిల్లాలకు భారీ వర్షాల ముప్పు సంభవించనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ సారి తీవ్ర ఆస్తి నష్టం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేస్తోంది. పలు యాపిల్ తోటలు ధ్వంసమయ్యాయి. తక్లెచ్ నుంచి నోగ్లీకి వెళ్లే మార్గంలో 30 మీటర్ల మేరకు రోడ్డు కొట్టుకుపోయింది. గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటిదాకా 30 మందికి పైగా మృతి చెందారు. మనాలీ..చండీగడ్ జాతీయ రహదారిని భారీ వర్షాల నేపథ్యంలో మూసివేశారు.
అధికారులు అప్రమత్తం
పలు వాహనాలను వేరే మార్గంలోకి మళ్లించారు. డల్హౌసీ ప్రాంతంలో అత్యధికంగా 62 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ ఎల్లో ఎలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే సహాయక చర్యలకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రెస్క్యూ టీమ్ చెబుతోంది. అధికార యంత్రాంగం అంతా రేయింబవళ్లూ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జరీచేసింది.వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ అన్ని కేంద్రాలలో ఉచిత నివారణ మందులు సరఫరా చేస్తోంది. ముందుగానే మందులు వాడి రోగాల బారిన పడకుండా రక్షించుకోవాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది.