Five States Assembly Elections : దేశప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్ లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండవ వారం నుంచి డిసెంబల్ మొదటివారం వరకూ జరిగే ఆస్కారం ఉందని ఎన్నికల సంఘానికి సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఈ ఐదు రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీలను అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. ఆయా అసెంబ్లీ స్థానాలకు 2018లో ఎన్నికలు జరిగాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2023 చివరిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపద్ధర్మ ప్రభుత్వాలుగా ఉండనున్నాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేంతవరకూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఆపద్ధర్మ ప్రభుత్వాలుగా కొనసాగనున్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ శాసనసభల పదవీకాలం వచ్చేఏడాది జనవరిలో ముగియనుండగా.. మిజోరాం శాసనసభ పదవీకాలం 2023 డిసెంబర్ 17తో ముగియనుంది. రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్ లకు ఒకేసారి పోలింగ్ నిర్వహించి, ఛత్తీస్ గఢ్ కి 2 విడతలలో పోలింగ్ జరపనున్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా.. మిజోరంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ సర్కార్, మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ రూలింగ్ లో ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు శుక్రవారం పరిశీలకుల బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. ఇరు పార్టీలు తమ పట్టు నిలుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నాయి. అలాగే ప్రతిపక్షంగా ఉన్న ప్రాంతాల్లో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కర్ణాటక విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఈసారి కేంద్రంలో చక్రం తిప్పడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.