Delhi : దేశంలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల యూపీలో గ్యాంగ్ స్టర్ , మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని పోలీసుల సమక్షంలోనే ముగ్గురు యువకులు కాల్చి చంపారు. తాజాగా ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.
లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఓ మహిళను టార్గెట్ చేశాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సాకేత్ కోర్టులోని లాయర్ ఛాంబర్ వద్ద కాల్పులు ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ కోసం ఆ మహిళ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి న్యాయవాదిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో కాల్పుల ఘటనలు పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.