Attack on Military base(National News) : పంజాబ్ లో సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్ పై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది.సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్లో కాల్పుల ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి.
కాల్పులు శబ్దం వినిపించగానే మిలటరీ స్టేషన్లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టారు.
ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు మిసైయ్యాయి. కాల్పులకు వాటినే వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన మిలిటరీ స్టేషన్ వద్దకు పంజాబ్ పోలీసులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు ఆధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు.
బఠిండా వ్యూహాత్మకంగా కీలక సైనిక స్థావరం. ఇక్కడ 10వ కోర్ కమాండ్కు చెందిన దళాలు ఉన్నాయి. జైపూర్ కేంద్రంగా పనిచేసే సౌత్-వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. బఠిండాలో భారీగా ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, కీలక ఆయుధాలున్నాయి.