Wrestlers Protest : ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. వారు 10 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు రెజ్లర్లకు అండగా నిలిచారు. వేల మంది రైతులు తరలివచ్చి రెజ్లర్లకు సంఘీభావం ప్రకటిస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న రైతులను టిక్రి సరిహద్దుల వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.పెట్రోలింగ్ను పెంచారు. చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రెజ్లర్లు స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఆయనపై చర్యలను తీసుకునే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.