Hand transplant : చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు అరుదైన శస్త్రచికిత్సలు చేసి వారి జీవితాల్లో వైద్యులు ఆశలను నింపారు. ఈ అరుదైన ఘనత హరియాణా లోని ‘అమృత ఆసుపత్రి’ వైద్య బృందం సాధించింది. ఇద్దరు వ్యక్తులకు ఉత్తర భారత్లో తొలిసారి శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన ఆసుపత్రిగా నిలిచింది.
ఢిల్లీకి చెందిన గౌతమ్ తయల్ (64) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. పదేళ్ల కిందట అతనికి కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. బ్రెయిన్ డెడ్తో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి చేతిని వైద్యులు గౌతమ్కు అమర్చారు. ప్రస్తుతం అతను విజయవంతంగా వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. త్వరలో డిశ్చార్జ్ చేస్తామని చేప్పారు. దేశంలో కిడ్నీ, చేతిని మార్పించుకొన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఈ తరహా శస్త్రచికిత్సలు చేయించుకొన్న రెండో వ్యక్తి గౌతమ్ కావడం విశేషం.
మూడేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన దేవాన్ష్ గుప్తా (19) అనే వ్యక్తికి కూడా ఈ ఆసుపత్రి వైద్య బృందం చేతులను అమర్చింది. బ్రెయిన్ డెడ్తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తి చేతులను సేకరించారు. గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఈ రెండు శస్త్రచికిత్సలను 17 గంటల్లో పూర్తి చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.