Adani Stocks: దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ఎక్స్ పర్ట్ కమిటీ సుప్రీంకోర్టు నివేదిక అందించింది. ఇందులో అదానీ కంపెనీ ఎలాంటి కృత్రిమ ట్రెడింగ్ జరపలేదని తేల్చింది. అయితే 13 విదేశీ కంపెనీల యజమాన్యాలపై సెబీ ఎటూ తేల్చలేకపోయిందని తెలిపింది. ఇక అదానీ స్టాక్స్ పై 849 ఆటోమెటిక్ అలర్ట్స్ వచ్చాయంది. ఇక స్టాక్స్ కు సంబంధించి విదేశీ సంస్థలను సంప్రదించడానికి కమిటీ ప్రయత్నించిందని.. కానీ ఏ సంస్థ కూడా వివరాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదంది.
అదానీ గ్రూప్పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో సంచలన ఆరోపణలు చేసింది. భారత స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ అకౌంటింగ్ ఫ్రాడ్స్ చేసిందని, కృత్రిమంగా షేర్ల విలువను పెంచిందని ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అయితే ఆ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ పెద్దగా లాభం లేకపోయింది. అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలిపోయాయి. అదానీ సంపద కూడా సగానికిపైగా కరిగిపోయింది. ఇక అదానీ గ్రూప్ వ్యవహారంపై .. విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా సెబీని గతంలో ఆదేశించింది. తాజాగా విచారణ కోసం సెబీకి గడువును మరో 3 నెలల పాటు పొడగించింది. అదానీ- హిండెన్బర్గ్ వ్యవహారానికి సంబంధించి ఆగస్టు 14 కల్లా రిపోర్ట్ తమకు సమర్పించాలని ఆదేశించింది.