Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరగనుంది. 224 స్థానాలున్న కర్ణాటక విధానసభకు ఒకే విడతలో ఎన్నిక జరుగుతోంది. ఈసారి కొన్ని కేంద్రాల్లో కొత్తగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.59 కోట్లమంది మహిళా ఓటర్లు ఉండగా, 2.62 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారు. కర్ణాటకలో తొలిసారి 9.17 లక్షల మంది కొత్తగా ఓటు వేయబోతున్నారు.
కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1320 కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఒక పోలింగ్ కేంద్రానికి యావరేజ్ గా 883 మంది ప్రజలు ఓట్లు వేస్తారు.
ఈసారి బెంగళూరు పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తోంది ఈసీ. చునవానా యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఎపిక్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. లాగిన్ తర్వాత సెల్ఫీ అప్ లోడ్ చేశాక ఓటు వేయవచ్చు. ఓటరు పోలింగ్ బూత్కు చేరుకున్నప్పుడు, వెరిఫికేషన్ కోసం వారి ముఖాన్ని ఫేషియల్ రికగ్నిషన్ తో స్కాన్ చేసి కన్ఫామ్ చేసుకుంటారు. దీంతో చాలా వరకు టైం ఆదా అవుతుంది. బెంగళూరు నగరంలో 264 థీమ్ బేస్డ్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తుండడంతో అక్కడ రెండు ఈవీఎంలను వాడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసినా కొన్ని చోట్ల హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అయితే వీటిని నిలిపేయాలని ఈసీ ఆదేశించింది. 144 సెక్షన్ అమలులో ఉందని ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని సూచించింది.
మరోవైపు కర్ణాటకలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కాంగ్రెస్, బీజేపీకీ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ప్రచారం ముగిసినా రెండు పార్టీల నుంచి డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మైసూరులోని చాముండేశ్వరి టెంపుల్ లో పూజలు చేశారు. ఆ తర్వాత డీకే శివకుమార్ బెంగళూరులోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రచార ముగిసే వరకు 375 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని సీజ్ చేసింది ఎన్నికల కమిషన్. గత ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగున్నర రేట్లు అధికం. ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు 147 కోట్లు కాగా.. మద్యం విలువ 84 కోట్లు, బంగారం, వెండి విలువ 97 కోట్లుగా ఉంది. ఇక ఉచితంగా పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన వస్తువుల విలువ 24 కోట్లు, డ్రగ్స్, నార్కోటిక్స్ విలువ 24 కోట్లుగా ఉంది. మొత్తం 2 వేల 896 FIRలు బుక్ అయ్యాయని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 288 కోట్లుగా ఉందని ఈసీ తెలిపింది. మొత్తం 81 నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని ఈసీ గుర్తించింది.
కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ఒక్క అధికార బీజేపీ మాత్రమే 224 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. JDS నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది పోటీ పడుతున్నారు. బీఎస్పీ నుంచి 133 మంది, JDU నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. CPI నుంచి నలుగురు పోటీ పడుతుండగా.. స్వతంత్రులు 918 మంది ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు మొత్తం 2,613 మంది పోటీ పడుతున్నారు.