Eternal Bride: డబ్బు సంపాదన కోసం రషీద అనే యువతి నిత్య పెళ్ళి కూతురులా మారింది. డబ్బున్న యువకులే టార్గెట్గా సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంది.
ఇలా లవ్లో దింపిన యువకులను పెళ్లి చేసుకుని..కొన్ని రోజులు కాపురం కూడా చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇది చెన్నైకి చెందిన రషీద అనే యువతి ఘరానా మోసం.ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏపీతోపాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 8 మందిని వివాహమాడింది ఈ మాయలేడి.
మొదటగా తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తి అనే వ్యక్తిని ట్రాప్ చేసింది రషీద. అతన్ని వివాహమాడి అతని ఇంట్లో ఉన్న 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో
అదృశ్యమైంది. దీంతో మూర్తి ఫిర్యాదుతో దర్యాఫ్తు మొదలు పెట్టిన పోలీసులకు రషీద బాగోతం బయటపడింది.
తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాలో రషీద పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే గడిచినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ నగదు, నగలతో జంప్ అయ్యింది. పోలీసుల దర్యాప్తు తర్వాత ఆమె అసలు బండారం బయటకొచ్చింది. సంపన్న యువకులే లక్ష్యంగా సోషల్ మీడియాలో వలవేసి వారితో పెళ్లి తర్వాత డబ్బులతో పరారవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారిలో ఉన్న రషీద కోసం గాలిస్తున్నారు పోలీసులు.