ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దూకుడు పెంచింది. బుధవారం ఉదయం నుంచి మరో ఆప్ కీలక నేత ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలువురు అప్రూవర్ లుగా మారిన నేపథ్యంలో.. ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కాం తో సంబంధమున్న వ్యాపారవేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కు పరిచయం ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
దినేష్ ను సంజయ్ సింగ్ దగ్గర ఉండి మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు పరిచయం చేసినట్లు ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. అంతేకాకుండా లిక్కర్ డిపార్ట్ మెంట్ తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఈడీ ఆరోపించింది. కానీ.. ఈ స్కామ్ లో సంజయ్ సింగ్ పేరును ఈడీ నిందితుల జాబితాలో చేర్చలేదు. ఛార్జిషీట్ లో అతని పేరున్నప్పటికీ..ఇంతవరకూ సమన్లు జారీ చేయలేదు. మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత.. ఈడీ సంజయ్ సింగ్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో సోదాలు పూర్తయ్యాక అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈడీ తదుపరి చర్యలు తీసుకోనుంది.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు చేయడాన్ని ఆప్ నేతలు ఖండించారు. అదానీ గ్రూపు గురించి ప్రశ్నించినందుకే సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ సోదాలు చేస్తోందని ఆప్ స్పోక్స్ పర్సన్ రీనా గుప్తా ఆరోపించారు. చైనా నుంచి న్యూస్ క్లిక్ సంస్థకు ఫండింగ్ వచ్చిందంటూ నిన్న జర్నలిస్టులపై, నేడు ఆప్ నేత ఇంటిలో సోదాలు చేయడాన్ని ఆమె ఖండించారు. మరో ఆప్ నేత మల్వీందర్ సింగ్ కూడా ఈ సోదాలపై స్పందించారు. బీజేపీ ఆప్ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఉదయం నుంచి సంజయ్ ఇంటిలో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులకు ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా అవినీతి సొమ్ముగా లభించలేదన్నారు. ఇదంతా కేవలం పొలిటికల్ రివేంజ్ అని మల్వీందర్ అభిప్రాయపడ్డారు.