EC on EVM Tampering: ఇటీవల ఏ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదలైనా.. ఈవీఎంలపై ఏదో ఒక వార్త హల్చల్ అవుతోంది. మొన్న ఏపీ, నిన్న హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన సంధర్భంగా ఈవీఎంలపై పలు ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఇక ఏపీలో అయితే కొందరు వైసీపీ నేతలు డైరెక్ట్ గా.. పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల ఫలితాలకు ముందు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయన్నది ఈసీ అభిప్రాయం. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈసీపై ఇటీవల పలువురు నాయకులు విమర్శలు సైతం చేశారు. అందుకే కాబోలు ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్న సందర్భంగా ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాలపై సీఈసీ స్పందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు విడుదలైన రాష్ట్రాలలో ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారని, నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అలాగే ఆరు నెలల ముందు ఈవీఎంలను తాము పరిశీలించడం జరుగుతుందని, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలు ఉపయోగిస్తామన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్
జార్ఖండ్లో రెండు విడతల్లో నవంబర్ 13, 20వ తేదీల్లో పోలింగ్
నవంబర్ 23న ఇరు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు
వివరాలు వెల్లడించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా@ECISVEEP… pic.twitter.com/7IhpcgzYDX
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2024
అలాగే ఈవీఎంల బ్యాటరీల ప్రక్రియపై సీఈసీ మాట్లాడుతూ.. పోలింగ్ కు ఐదు రోజుల ముందే ఈవీఎంలకు బ్యాటరీలు అమర్చడం జరుగుతుందని, ఈవీఎంలకు మూడంచెల భద్రత నిరంతరం ఉంటుందన్నారు. ఇంత భద్రత కల్పిస్తున్నా పలువురు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనే అంశం చర్చకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉందని.. అసలు ట్యాంపరింగ్ అసాధ్యమన్నారు.
Also Read: Election Commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల… పోలింగ్ ఎప్పుడంటే..?
ఇక ఎగ్జిట్ పోల్స్ గురించి స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్ కేవలం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, వాటిని కేవలం అంచనాల మాదిరిగానే భావించాలన్నారు. పలుమార్లు ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని, ఎగ్జిట్ పోల్స్ లో ఎన్నికల సంఘం ప్రమేయం ఉండదన్నారు. సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు హర్యానా ఎన్నికల సమయంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను దృష్టిలో ఉంచుకుని చేసినట్లుగా భావించవచ్చు.
అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎన్నికల కమిషన్ పై నిందలు వేయడం తగదని, ఎగ్జిట్ పోల్స్ కు ఎటువంటి శాస్త్రీయత ఉండదన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో జరిగే ఎన్నికల ప్రక్రియకు నాయకులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. అలాగే ఎన్నికల అధికారులకు ప్రజల సహకారం అవసరమని, పార్టీలు కూడా ఎన్నికల నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.