ED Raids In Bihar(Today latest news telugu): సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. వారంలోపు సీఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి కీలక సమయంలో బిహార్ లో ఈడీ దాడులు కలకలం రేపాయి. ఆర్జేడీ ముఖ్య నేత సుభాష్ యాదవ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఆయన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. మైనింగ్ వ్యాపారి నిర్వహిస్తున్నారు.
ఆర్జేడీ నేత సుభాష్ యాదవ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా రూ. 161 కోట్లు ఆయన సంపాదించారని గతంలో ఆయనకు చెందిన కంపెనీపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
సుభాష్ యాదవ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలం ఆరు చోట్ల సోదాలు జరిపారు. 2 కోట్ల 30 లక్షల రూపాయల నగదును గుర్తించారు. నగదుతోపాటు వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సుభాష్ యాదవ్ ను ఈడీ అరెస్ట్ చేసింది.
సుభాష్ యాదవ్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ చేశారు. జార్ఖండ్ లోని ఛాత్రా లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇటీవల రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మార్చి 3న పాట్నా గాంధీ మైదానంలో మహా బంధన్ జన విశ్వాస్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహణలో సుభాష్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
Read More : ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా.. లోక్సభ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం..
మరోవైపు బిహార్ లో ఆర్జేడీతో సీఎం నితీశ్ కుమార్ ఇటీవల బంధాన్ని తెంచుకున్నారు. బీజేపీతో జతకట్టి కొత్త సర్కార్ ను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇలా నితీశ్ ఎన్డీఏ పక్షాన చేరిపోయారు. అధికారం కోల్పోయిన ఆర్జేడీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో సుభాష్ యాదవ్ ను ఈడీ అరెస్ట్ చేయడం బిహార్ లో చర్చనీయాంసంగా మారింది.