EaseMyTrip Resumes Bookings To Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్స్ పర్యటనపై మల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్రావెల్ టెక్ ప్లాట్ ఫారమ్ ఈజ్ మై ట్రిప్ ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తూ గత జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో మళ్లీ బుకింగ్స్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఈజ్ మై ట్రిప్ సీఈవో నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
“భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య బుకింగ్స్ మొదలు పెడుతున్నాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ విజన్ కు సపోర్టుగా ముందుకుసాగుతాం. తాము తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య స్నేహం, పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు పడుతాయని భావిస్తున్నాం” అని వెల్లడించారు.
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు
ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటించారు. దేశీయంగా పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. మోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు భారత్ పై, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీచ్ టూరిజంలో భారత్ తమతో పోటీ పడలేదంటూ ఎద్దేవా చేశారు. పరుష పదజాలాన్ని వాడారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను ఆదేశ అధ్యక్షుడు ముయిజ్జు పదవుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో తమ దేశంపై, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఈజ్ మై ట్రిప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేసింది. భారత్ నుంచి టూరిస్టుల రాక నిలిచిపోవడంతో మాల్దీవులు ట్రావెల్ ఆపరేటర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
తమ జీవనాధారానికి భారతీయ టూరిస్టులే కీలకం అని, వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ ఈజ్ మై ట్రిప్ వెనక్కితగ్గలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో మళ్లీ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
భారత పర్యటనకు వస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు
అటు మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత పర్యటను వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారత్ లోని పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదేశంలో పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతిన్నది. అటు చైనాకు అనుకూలంగా వ్యవహరించడంతో భారత్ మరింత కఠినంగా వ్యవహరించింది.
ఈ నేపథ్యంలో ఆదేశ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. దిక్కుతోచని స్థితిలో మళ్లీ భారత్ తో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ముయిజ్జు. అందులో భాగంగానే 5 రోజుల భారత పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించనున్నారు. వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాల అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నారు. మరి, ఇండియన్స్ మాల్దీవులకు మళ్లీ వెళ్తారో లేదో అనేదే సందేహం. బ్యాన్ వల్ల ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు.. ‘ఉపాధి’ కోల్పోయారు. ఈ న్యూస్ విన్నాక ముందు వాలిపోయేది వాళ్లేనని నెటిజన్స్ అంటున్నారు.
Read Also: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!