Due to the Heavy Rains Chardham visit stopped by officers
ఉత్తరాఖాండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీనితో ఆదివారం చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఉత్తరాఖాండ్ లోని గర్వాల్ ప్రాంతంలో అతిభారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో గర్వాల్ కమిషనర్ అప్రమత్తమయ్యారు. జూన్ 7, 8 తేదీలలో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. రుషికేశ్ నుండి చార్ ధామ్ యాత్రను ప్రారంభించవద్దని భక్తులకు సూచనలిస్తున్నారు. ఇప్పటికే చార్ ధామ్ కు చేరుకున్న భక్తులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. వాతావరణం అనుకూలించేదాకా వేచి చూడాలని భక్తులను కోరుతున్నారు.
ఇద్దరు హైదరాబాదీలు మృతి
ఇప్పటికే పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ వెళ్లే రహదారిపై అనేక చోట్ల రోడ్డుకు అడ్డంగా కొండరాళ్లు పడి ఆ ప్రాంతం బ్లాక్ అయింది. చమేలీ జిల్లా
కర్ణప్రయాగ్ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. జోషిమఠ్ సమీపంలో విష్ణుప్రయాగ వద్ద అలకనంద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పలుచోట్ల ఉత్తరాఖాండ్ నదులు నిండుకుండలను తలపిస్తున్నాయి.