Heart Attack : బస్సులో 65 మంది ప్రయాణికులు. రోడ్డుపై బస్సు నడుపుతుండగా.. ఆ డ్రైవర్ కు గుండెపోటు వస్తే.. 65 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలే. కానీ.. ఆ బస్సు డ్రైవర్ మాత్రం బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు. తీవ్రమైన నొప్పిలోనూ అందరి ప్రాణాలను కాపాడిన ఆ డ్రైవర్ గుండె.. బస్సు ఆపడంతోనే ఆగిపోయింది. డ్రైవర్ బస్సును ఆపిన వెంటనే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పటాపూర్ చక్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి పంచలింగేశ్వర ఆలయం వైపు 65 మంది పర్యాటకులతో బస్సు వెళ్తోంది. దారిమధ్యలో డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కకగా ఆపి స్పృహ కోల్పోయాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు.. స్థానికులను పిలిచారు. వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడిని షేక్ అక్తర్ గా గుర్తించారు.
డ్రైవర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురై బస్సును రోడ్డు పక్కకు ఆపివేశారని, వెంటనే స్పృహ కోల్పోయాడని ప్రయాణికుల్లో ఒకరైన అమిత్ దాస్ తెలిపారు. తానెంత నొప్పితో విలవిల్లాడినా తామందరి ప్రాణాలను కాపాడిన డ్రైవర్ మనోగతాన్ని ప్రయాణికులు, స్థానికులు కొనియాడారు. కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. డ్రైవర్లు గుండెపోటుకు గురైనా.. ప్రయాణికులకు ఏమీ కాకూడదని ఆఖరి నిమిషంలోనూ డ్యూటీ చేసిన డ్రైవర్లెందరో ఉన్నారు.