Dog Empathy : విశ్వాసానికి మారుపేరు శునకం. ఇది అక్షరాలా నిజం. ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద పెడితే.. అది బతికున్నంత వరకూ తన ఆకలిని తీర్చిన వారిని గుర్తుంచుకుంటుంది. మళ్లీ కనిపించినపుడు తోక ఊపుతూ పలుకరిస్తుంది. పెంపుడు కుక్కల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదంలో ఉన్న యజమానులను కాపాడిన సంఘటనలు, యజమాని చనిపోతే ఆ బాధతో ఆ సమాధివద్దే రోధించి చనిపోయిన శునకాల కథలెన్నో ఉన్నాయి. కానీ.. తాజాగా కర్ణాటకలో వెలుగుచూసిన ఈ ఘటన వీటన్నింటికీ పూర్తిగా భిన్నం. తనను కాపాడబోయి.. తన కారణంగా రోడ్డుప్రమాదంలో మరణించిన ఓ యువకుడి కుటుంబాన్ని వీధి శునకం ఓదారుస్తోంది. దావణగెరెలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
దావణగెరెకు చెందిన తిప్పేష్ (21) తన సోదరిని బైక్ పై బస్టాప్ లో దింపి.. తిరిగి ఇంటికి వస్తుండగా.. ఒక వీధిలో నుంచి ఉన్నట్టుండి ఒక శునకం పరిగెత్తుకు వచ్చింది. దానిని గమనించిన తిప్పేష్ సడెన్ బ్రేక్ వేయడంతో.. అదుపుతప్పి కిందపడిపోయింది. దాంతో అతని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఆ శునకం.. తిప్పేష్ మృతదేహంతో పాటు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుతూ అతని ఇంటివరకూ వెళ్లింది. అంత్యక్రియలు పూర్తవుతుండగా.. అక్కడక్కడే తిరిగింది.
ఆ తర్వాత కూడా తిప్పేష్ ఇంటి ముందే తిరుగుతూ ఉంది. ఆ కుక్క ప్రవర్తన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతలో స్థానిక వీధికుక్కలు తరమడంతో దూరంగా వెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ తిప్పేష్ ఇంటిముందుకొచ్చింది. రెండు, మూడు రోజులు అక్కడక్కడే తిరిగిన ఆ కుక్క.. తిప్పేష్ ఇంట్లోకి ప్రవేశించి.. అతని తల్లిచేతిలో దాని తలను ఉంచి మూగగానే రోధించింది. నా వల్లే అతను చనిపోయాడన్న పశ్చాత్తాపాన్ని వారికి అర్థమయ్యేలా చేసిందని తిప్పేష్ తల్లి యశోదమ్మ తెలిపారు. తనను క్షమించాలని కోరుతూ.. ఆ కుక్క ప్రవర్తించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇప్పుడు ఆ శునకం తిప్పేష్ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా అయింది. తన ప్రాణాన్ని కాపాడిన యువకుడి కుటుంబానికి ఆ శునకం దగ్గరై.. ఓదారుస్తోంది.