R.K. Narayanan : ఆర్.కె.నారాయణ్ ప్రముఖ భారతీయ రచయిత. ఆయన మాల్గుడి పేరుతో ఒక కాల్పనిక పట్టణాన్ని సృష్టించారు. అక్కడ ప్రజలు, వారి ఆచారాలపై ధారావాహిక నవలలు, కథలు రాశారు. ఆంగ్లభాషలో భారత సాహిత్యరంగ ప్రారంభదశలో గొప్ప రచయితల్లో ఆయన ఒకరు. ఆ కాలంలో ఆర్.కె.నారాయణ్, ముల్క్ రాజ్ ఆనంద్, రాజారావు ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆర్.కె.నారాయణ్ రాసిన ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాహిత్య అకాడెమీ అవార్డు కైవసం చేసుకుంది. నారాయణ్ రాసిన ది గైడ్ నవల హిందీ, ఇంగ్లీషు భాషల్లో సినిమాగా వచ్చింది. ఆయన రాసిన కథలలో సామాజిక అంశాలకే ప్రాధాన్యం ఉండేది. నారాయణ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
మైసూర్ లోని ఆర్.కె. నారాయణ్ ఇంటి ముందున్న యాదవగిరి సర్కిల్లో ‘మాల్గుడి డేస్’లోని మూడు పాత్రలను కాంస్య విగ్రహాలుగా ఆవిష్కరించారు. ఆ పాత్రలు– స్వామి, మణి , శంకర్. ఈ పాత్రలు ఆర్.కె.నారాయణ్ ఇంటివైపు చూస్తూ ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు. తాను పోషించిన స్వామి పాత్ర ముందు నిల్చుని నాటి బాలనటుడు మంజూనాథ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
నారాయణ్ ఇంటి ముందు రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో విగ్రహాలను ఏర్పాటు చేయలేదు. ఓ పెద్దమనిషి సొంతఖర్చుతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలా చేస్తే తన ఊరికి గౌరవం దక్కుతుందని భావించారు. ఈ విధంగా గొప్ప రచయితకు నివాళులు అర్పించినట్లుగా భావించారు.
ఇలా పాత్రలు.. రచయితల ఇళ్ల ముందు కొలువు దీరితే బావుంటుందని అనిపించిందా? గురజాడ ఇంటి ముందు మధురవాణి పాత్రను కూడా విగ్రహం రూపంలో పెడితే బాగుంటుంది కాదా..!